ఇల్లు లేని నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ తెలిపారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి బాలసముద్రం లోని అంబేద్కర్ నగర్లోగల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించారు..
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల పక్షపాతి అని, పేదలు గొప్పగా బతకాలనే ఆయన సంకల్పానికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లే నిదర్శనమని అన్నారు. పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం కోసం ఇంత పెద్ద ఎత్తున దేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం లేదని, ఈ విషయంలో తెలంగాణ ముందు వరుసలో ఉన్నదని ఆయన అన్నారు. పనులు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో తాగునీరు, విద్యుత్, ఇతర మౌళిక వసతుల పనులు వేగవంతం చేయాలని అన్నారు. పేదలకు వాటిని అందించే కార్యక్రమం చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సౌకర్యాలు, మంచి నీటి సౌకర్యాలు, ఇతర మౌళిక సౌకర్యాలు సత్వారమే కల్పించాలని, పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అన్నారు.