ప్రస్తుతం ప్రతి ఒక్కరికి ఆధార్కార్డు తప్పనిసరి ధ్రువీకరణగా మారింది.అందువలన పాఠశాలల్లో ప్రవేశం పొందే విద్యార్థులకు అత్యంత అవసరంగా మారింది. అధికారయంత్రాంగం తాజా చర్యలతో జిల్లాలో విద్యాశాఖ వద్ద ఉన్న సమాచారం మేరకు ఆధార్కార్డులేని 6,460 మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది.
భీంపూర్ మండలం అర్లి-టి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల చిన్నారులు. ఇటీవల ముగిసిన బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రవేశం పొందారు. ఇందులో చాలామందికి ఆధార్కార్డులు లేవు. ఇలాంటి వారందరికీ విద్యాశాఖ యంత్రాంగమే పాఠశాలకు వచ్చి ఆధార్ నమోదు ప్రక్రియను చేపట్టనుంది.
జిల్లాలో 18 మండలాలు ఉండగా.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కలిపి 1439 ఉండగా.. అందులో కిందటేడాది డైస్ లెక్కల ప్రకారం నర్సరీ మొదలుకొని పదో తరగతి వరకు 1,35,868 మంది విద్యార్థులు ఉన్నారు. తాజాగా బడిబాట కార్యక్రమంలో, నేరుగా పాఠశాలల్లో ప్రవేశం పొందిన వారిలోనూ ఆధార్కార్డు లేని విద్యార్థులు చాలామందే ఉన్నట్లుగా అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం అమలు చేసే ఉచిత పాఠ్యపుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం వంటివి ఆయా విద్యార్థులకు అందాలంటే ఆధార్ నమోదు తప్పనిసరి అయ్యింది. సర్కారు బడుల్లో చదివే విద్యార్థులు పేదలు కావడం, వారు చదువుకునే ప్రాంతంలో ఆధార్ నమోదు కేంద్రాలు లేకపోవడం నమోదు ప్రక్రియ పట్ల అనాసక్తిని ప్రదర్శిస్తున్నారు.
నమోదు.. నవీకరణ..ఆధార్ సంఖ్య లేని విద్యార్థులను ఇది వరకే గుర్తించగా.. వారందరికి పాఠశాలకు వెళ్లి ఆధార్ నమోదు ప్రక్రియ చేపడతారు. ఇందుకోసం మండలానికి ఒక ఆధార్కిట్ను అందజేశారు. ఇప్పటికే ఎంఐఎస్ కో-ఆర్డినేటర్లకు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ సైతం పూర్తయ్యింది. హెచ్ఎం ధ్రువీకరించిన పత్రం తీసుకుని విద్యార్థులకు ఆధార్ లేకుండా నమోదు చేస్తారు. ఇప్పటికే ఆధార్ కార్డు ఉండి వేలిముద్రలు, కనుపాపల స్కానింగ్తో పాటు చరవాణి నెంబరును ఆధార్కార్డుకు అనుసంధానించేలా నవీకరణ ప్రక్రియ కూడా చేపడతారు.
త్వరలో ఆధార్ నమోదు కోసం సిబ్బంది పాఠశాలలకే వస్తారు. ఎవరైతే ఆధార్కార్డు కలిగి ఉండరో వారంతా తప్పనిసరి నమోదు చేయించుకునేలా ఉపాధ్యాయులు చూడాలి.