21 ఏళ్లలోపు వారు ఒక్కరున్నా.. పబ్ లో నో ఎంట్రీ !

     Written by : smtv Desk | Sat, Jun 25, 2022, 11:21 AM

21 ఏళ్లలోపు వారు ఒక్కరున్నా.. పబ్ లో నో ఎంట్రీ !

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటన జరిగిన తర్వాత పబ్ నిర్వాహకుల తీరులో కొంత మార్పు కనిపిస్తోంది. 21 ఏళ్లు నిండిన వారికే ప్రవేశం అంటూ పబ్ ల ముందు బోర్డులు పెట్టడం మొదలైంది. ఇటీవలే ఓ పబ్ నుంచి మైనర్ బాలికను కారులో తీసుకెళ్లిన యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడడం పెద్ద సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ప్రముఖ రంగంలో అధికారులుగా ఉన్న వాళ్ళ పిల్లలు ఈ కేసులో నిందితులుగా ఉండడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఘటన తర్వాత పబ్ ల సంస్కృతిపై బీజేపీతోపాటు ఇతర ప్రతిపక్షాలు విమర్శలు కురిపించాయి.ఈ పరిణామాలతో పబ్ ల నిర్వాహకులు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. మేజర్ అయిన వారికి పబ్ లో ప్రవేశానికి అనుమతి ఉంటుంది. అందుకనే 21 ఏళ్లు అంటూ పబ్ ల ముందు బోర్డులు పెడుతున్నారు. 21 ఏళ్లలోపు వారు ఒక్కరున్నా.. గ్రూపు, కుటుంబ పార్టీలకు పబ్ లు నో చెప్పేస్తున్నాయి. కొన్ని పబ్ లు పదేళ్లలోపు పిల్లలను పెద్దలతో కలసి లంచ్ పార్టీలకు అనుమతిస్తున్నాయి. కాకపోతే ఎక్కువ శాతం పబ్ లు పెద్దలకు మాత్రమే ప్రవేశం అన్న నిబంధనను అమలు చేస్తున్నాయి. మే 27 నాటి ఘటన తర్వాత పబ్ యజమానులు తీవ్ర ఆందోళనతో ఉన్నట్టు.. ఎవరికీ అవకాశం ఇవ్వరాదని భావిస్తున్నట్టు ఓ పబ్ నిర్వాహకుడు తెలిపారు. అందుకనే పెద్దలతో కలసి వచ్చినా మైనర్లను పబ్ లు అనుమతించడం లేదు.





Untitled Document
Advertisements