వెళ్లిపోవాలనుకున్న వారు వెళ్లిపోవచ్చు.. కొత్త శివసేనను తయారు చేస్తా!

     Written by : smtv Desk | Sat, Jun 25, 2022, 12:32 PM

వెళ్లిపోవాలనుకున్న వారు వెళ్లిపోవచ్చు.. కొత్త శివసేనను తయారు చేస్తా!

శివసేనను అంతం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మండిపడ్డారు. పార్టీ కార్యకర్తతో వర్చువల్ గా జరిగిన సమావేశంలో థాకరే మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. క్లిష్ట సమయంలో కూడా అండగా ఉన్న పార్టీ నేతలు, కార్యకర్తలే శివసేన అసలైన ఆస్తి అని చెప్పారు. సొంత వ్యక్తుల చేతిలోనే శివసేన మోసపోయిందని థాకరే ఆవేదన కి గురయ్యారు. ఏక్ నాథ్ షిండేతో పాటు గౌహతిలో మకాం వేసిన పార్టీ రెబెల్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీకి ద్రోహం చేసి వెళ్లిపోయిన వీరందరికి మనం ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చామని... మీలో చాలా మంది టికెట్లు ఆశించినప్పటికీ, మీకు కాకుండా వారికి టికెట్లు ఇచ్చామని చెప్పారు. మీ త్యాగాలతో, మీ ఓట్లతో గెలిచిన తర్వాత వీరంతా పార్టీకి వెన్నుపోటు పొడిచి వెళ్లారని మండిపడ్డారు. ఇంత కష్ట కాలంలో కూడా పార్టీ వెన్నంటి ఉన్న మీకు కేవలం ధన్యవాదాలు చెపితే సరిపోదని అన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న భాగస్వామ్య పార్టీల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిశీలించాలని షిండేకు తాను చెప్పానని... అయితే, ఆ పని చేయకుండా... బీజేపీతో చేతులు కలపాలని మన ఎమ్మెల్యేల నుంచి ఒత్తిడి వస్తోందని ఆయన తనతో చెప్పారని అన్నారు. బీజేపీతో కలవాలంటున్న ఎమ్మెల్యేలను తన వద్దకు తీసుకురావాలని, వారితో తాను మాట్లాడతానని చెప్పానని తెలిపారు. శివసేనను బీజేపీ చాలా దారుణంగా చూసిందని అన్నారు. శివసేన రెబెల్ ఎమ్మెల్యేలలో చాలా మందిపై కేసులు ఉన్నాయని... బీజేపీతో చేతులు కలిపితే వారికి క్లీన్ చిట్ వస్తుందని... శివసేనలోనే ఉంటే వాళ్లు జైలుకు పోతారని అన్నారు. శివసేనకు చెందిన వ్యక్తి సీఎం అయ్యే అవకాశం ఉంటే బీజేపీలోకి వెళ్లండని షిండేని ఉద్దేశించి థాకరే చెప్పారు. కానీ బీజేపీతో చేతులు కలిపినంత మాత్రాన మీరు సీఎం కాలేరని, బీజేపీ వ్యక్తే సీఎం అవుతారని, మీకు డిప్యూటీ సీఎం మాత్రమే అయ్యే అవకాశం ఉందని అన్నారు. ఒకవేళ ఉప ముఖ్యమంత్రి కావాలనే కోరిక మీకు ఉన్నట్టయితే, ఆ విషయాన్ని తనతో చెప్పి ఉంటే తానే డిప్యూటీని చేసేవాడినని అన్నారు. శివసేనను నడిపించే శక్తి తనకు లేదని పార్టీ వర్కర్లు భావిస్తే... అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడానికి తాను సిద్ధమని థాకరే చెప్పారు. హిందూ ఓటు బ్యాంకును వేరే పార్టీతో పంచుకోవాలని బీజేపీ భావించడం లేదని... అందుకే శివసేనను అంతం చేయాలనుకుంటోందని విమర్శించారు. హిందూ ఓటు బ్యాంకు చీలకూడదనే ఏకైక ఉద్దేశంతోనే బాల్ థాకరే బీజేపీతో చేతులు కలిపారని గుర్తు చేశారు. శివసేన రెబెల్ ఎమ్మెల్యేలతో కలిపి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా అది ఎక్కువ కాలం ఉండదని థాకరే చెప్పారు. ఎందుకంటే రెబెల్ ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది సంతోషంగా లేరని అన్నారు. శివసేన రెబెల్స్ ఎవరూ కూడా వచ్చే ఎన్నికల్లో గెలవరని జోస్యం చెప్పారు. శివసేన ఓటర్ల వల్ల గెలిచిన ఎమ్మెల్యేలను మీరు తీసుకెళ్లి ఉండొచ్చని... కానీ శివసేన ఓటర్లను మాత్రం తీసుకెళ్లలేరని అన్నారు. పార్టీ నుంచి వెళ్లిపోవాలనుకున్న వారు వెళ్లిపోవచ్చని... తాను కొత్త శివసేనను తయారు చేస్తానని చెప్పారు.





Untitled Document
Advertisements