గువాహతిలోని బ్రహ్మపుత్ర, బరాక్ నదులు పొంగిపొర్లుతుండటంతో అస్సాంలో వరద ఉధృతి నెలకొంది . గత 24 గంటల్లో సంభవించిన మరో పది మరణాలతో కలిపి మొత్తం మృతుల సంఖ్య 118కి చేరుకుందని అధికారులు తెలిపారు.అస్సాంలో వరద బీభత్సం ఇంకా కొనసాగుతూనే ఉంది. వందేళ్లలో ఈ ప్రాంతంలో ఇంత దారుణమైన పరిస్థితులు ఇదే ప్రథమంగా కనిపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో మనుషులు మునిగిపోయేంత మేర వరద నీరు ఇంకా పేరుకుపోయే ఉంది. వరదల ప్రభావం తీవ్రంగా ఉన్న చచార్ జిల్లాలోని సిల్చార్ చాలా భాగం వరద నీటిలోనే మునిగి ఉంది .బాధితుల కోసం ఐఏఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆహార పొట్లాలు, మంచినీటి ప్యాకెట్లు అందజేస్తున్నాయి. రెండు కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలను కూడా రంగంలోకి దించారని అక్కడి అధికారులు తెలిపారు. సిల్చార్లో 3 లక్షల మంది నీరు, ఆహారం, అవసరమైన మందుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు .