ప్రధాని నరేంద్ర మోదీ జులై 4న ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి రాబోతున్నారు .. స్థానిక ఏఎస్ఆర్ నగర్ పురపాలక పార్కు ప్రాంగణంలో ఏర్పాటచేయనున్న 30 అడుగుల అల్లూరి సీతరామరాజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా మోదీ పర్యటనను ఖరారు చేశారు. హైదరాబాద్ పర్యటన ముగించుకుని 4న ఉదయం హైదరాబాద్లోని బేగంపేట విమానశ్రయం నుంచి బయలు దేరి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారని అధికార వర్గాలు వెల్లడించాయి. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఉదయం 10.50 గంటలకు భీమవరానికి చేరుకుని అల్లూరి విగ్రహావిష్కరణ, బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం విజయవాడ విమానాశ్రయం చేరుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరుతారు .