సీనియర్ నటుడు మరియు శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధిపతి అయిన మోహన్బాబు ఆయన కుమారుడు విష్ణు, మనోజ్ ఈరోజు తిరుపతి కోర్టుకు హాజరుకానున్నారు. తమ విద్యాసంస్థలో చదువుకునే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదంటూ అప్పటి టీడీపీ గవర్నమెంట్ ను విమర్శిస్తూ 2019 మార్చి 22న తన కాలేజీ ముందు ధర్నా చేపట్టారు. ఈ ఆందోళన కారణంగా తిరుపతి-మదనపల్లి హైవేపై వచ్చే పోయే వాహనాలకు తీవ్ర అంతరాయం కలిగి భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
దీనిపై అప్పటి ఎంపీడీవో, ఎంసీసీ టీమ్ అధికారి హేమలత చంద్రగిరి పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఎన్నికల అధికారుల నుంచి కానీ పోలీసు శాఖ వారి నుంచిగానీ ఎటువంటి అనుమతి తీసుకోకుండానే ధర్నా చేపట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మోహన్ బాబు, విష్ణు, మనోజ్తో పాటు శ్రీ విద్యా నికేతన్ విద్యాసంస్థల ఏవో తులసి నాయుడు, పీఆర్వో సతీష్లపై చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 290, 341, 171 (ఎఫ్) రెడ్ విత్ 34 సెక్షన్లతో పాటు పోలీస్ యాక్ట్ సెక్షన్ 34 కింద కేసులు పెట్టారు. ఈ కేసుకు సంబంధించి విచారణ కొరకు మంచు ఫ్యామిలీ నేడు కోర్టుకు హాజరుకానున్నారు. అయితే మంచు కుటుంబం నేరుగా కోర్టుకు హాజరు కాకుండా తిరుపతిలోని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి పాదయాత్రగా వెళ్ళాలి అనుకోవడం చర్చనీయాంశం గా మారింది.