ఇస్లామాబాద్, జనవరి 7 : ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రధారి సయీద్కు చెందిన ఉగ్రవాద సంస్థ జమాత్-ఉల్-దవా(జేయూడీ), ఫలాఫ్-ఈ-ఇన్సానియత్ ఫౌండేషన్(ఎఫ్ఐఎఫ్) సంస్థలను బ్లాక్ లిస్ట్లోకి చేర్చినట్లు పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది.
అలాగే మొత్తం 72 నిషేధిత సంస్థల జాబితాను బ్లాక్ లిస్ట్లోకి చేర్చి, వారికి నోటీసులు జారీ చేసింది. కాగా ఈ నిషేధ సంస్థలకు ఎవరైనా విరాళాలు అందిస్తే వారికి 10ఏళ్ల జైలు శిక్షతో పాటు, భారీ జరిమానా కూడా విధించనున్నట్లు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇలాంటి నిషేధిత సంస్థలకు విరాళాలు అందించడాన్ని నేరంగా పరిగణిస్తారు.
అక్రమ దారుల్లో ఉగ్రవాద సంస్థలకు నిధులు చేరడాన్ని అడ్డుకునేందుకు ఈ చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా ఇటీవలే అమెరికా.. పాకిస్తాన్ కు రక్షణ, భద్రత సాయం నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయ౦ తెలిసిందే. ఈ క్రమంలో పాక్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.