కొత్తగా పదిలక్షల మందికి పెన్షన్లు..తెలంగాణ కేబినేట్‌ కీలక నిర్ణయాలు

     Written by : smtv Desk | Sun, Aug 14, 2022, 02:03 PM

కొత్తగా పదిలక్షల మందికి పెన్షన్లు..తెలంగాణ కేబినేట్‌ కీలక నిర్ణయాలు

తెలంగాణలో 15 ఆగస్టు నుంచి రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల పెన్షన్లు మంజూరు చేస్తూ క్యాబినెట్‌ నిర్ణయించింది. స్వాతంత్య వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 21న తలపెట్టిన శాసనసభ, స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాలు రద్దు చేశారు. స్వాతంత్య వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 16న ఉదయం 11.30 నిమిషాలకు రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన జరపాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 36 లక్షల పెన్షన్ల అందజేస్తోంది.తాజాగా అదనంగా 10 లక్షల మందికి కొత్త పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది. కొత్తవి.. పాతవి కలిపి మొత్తం 46 లక్షల మందికి పెన్షన్‌ ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఐదు గంటల పాటు సాగిన ఈ భేటీలో పలు అంశాలపై చర్చించారు. ఇక స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీల విడుదలకు క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది. కోఠి ఈఎన్‌.టి. ఆస్పత్రికి 10 మంది స్పెషలిస్ట్ డాక్టర్‌ పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపింది. అలాగే కోఠి ఈఎన్‌టి ఆస్పత్రిలో అధునాతన సౌకర్యాలతో టవర్‌ నిర్మించాలని నిర్ణయించారు.
సరోజినీ దేవి కంటి దావాఖానలో కూడా అధునాతన సౌకర్యాలతో కూడిన నూతన భవన సముదాయాన్ని నిర్మించేందుకు ప్రతిపాదనలు చేశారు. అలాగే ఖాళీగా ఉన్న 5111 అంగన్‌ వాడీ టీచర్లు, ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కేబినెట్‌ ఆమోదించిది. జీవో 58, 59 కింద పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని చీఫ్‌ సెక్రటరీకి కేబినెట్‌ ఆదేశం ఇచ్చింది. గ్రామకంఠంలో నూతన ఇళ్ల నిర్మాణానికి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధికారులతో ఒక కమిటీ వేసి, 15 రోజుల్లోగా ఒక నివేదిక ఇచ్చి, సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని నిర్ణయించారు.
వికారాబాద్‌లో ఆటోనగర్‌ నిర్మాణానికి 15 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ కేబినెట్‌ నిర్ణయించింది. తాండూరు మార్కెట్‌ కమిటీకి యాలాలలో 30 ఎకరాల ఎకరాల స్థలం కేటాయించారు. షాబాద్‌లో బండల పాలిషింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు టీఎస్‌ ఐఐసీ ఆధ్వర్యంలో 45 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 21వ తేదీన తలపెట్టిన శాసనసభ, స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాలు రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 21వ తేదీన పెళ్లిళ్లు, శుభకార్యాలకు చివరి ముహూర్తం కావడం వల్ల పెద్దఎత్తున వివాహాది శుభకార్యక్రమాలు ఉన్నందున ప్రజా ప్రతినిధుల నుంచి వస్తున్న వినతులను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రత్యేక సమావేశాలను రద్దు చేయాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.





Untitled Document
Advertisements