ముంబయి, జనవరి 8 : దేశవ్యాప్తంగా ఎందరో సంపన్నులు ఉన్న, అత్యంత సంపన్నుడు అనగానే ముందుగా గుర్తు వచ్చే వ్యక్తి ముఖేశ్ అంబానీ. ఒక్క మనదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంపన్నుల్లో ఒకరైన అంబానీ సంపద 2017లో 77శాతం పెరిగిందట. కానీ, గతేడాది అంబానీకి పోటీగా అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ సంపద 125 శాతం పెరగింది. ఈ మేరకు సమాచారాన్ని బ్లూమ్బర్గ్ డేటా వెల్లడించింది. అయితే, సంపద విలువలో ముఖేశ్ అంబానీతో పోలిస్తే తక్కువే అయినప్పటికీ.. వేగంగా ఆస్తులు పెరగడంతో అంబానీ కంటే అదానీ ముందున్నారు.
గతేడాది జనవరిలో గౌతమ్ అదానీ సంపద 4.63 బిలియన్ డాలర్లు కాగా, గతేడాది డిసెంబరు 31 నాటికి ఆయన ఆస్తులు 10.4 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఇక అదానీ తర్వాత డీ-మార్ట్ యజమాని రాధాకృష్ణ దమానీ రెండో స్థానంలో ఉన్నారు. గతేడాది ఆయన సంపద 80శాతం పెరిగింది. గతేడాది మార్చిలో దమానీ ఆస్తులు విలువ 3.88బిలియన్ డాలర్లు ఉండగా.. డిసెంబరు చివరి నాటికి ఆ మొత్తం 6.96 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇక అంతర్జాతీయంగా ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన జెఫ్ బిజోస్ సంపద 2017లో 52శాతం పెరిగింది. గతేడాది జనవరిలో ఆయన సంపద 65 బిలియన్ డాలర్లు ఉండగా, డిసెంబరు 31 నాటికి 99 బిలియన్ డాలర్లకు పెరిగిందట.