భారత వృద్ధిరేటును అప్‌గ్రేడ్‌ చేసిన వరల్డ్ బ్యాంకు!

     Written by : smtv Desk | Wed, Jan 10, 2018, 12:42 PM

భారత వృద్ధిరేటును అప్‌గ్రేడ్‌ చేసిన వరల్డ్ బ్యాంకు!

వాషింగ్టన్, జనవరి 10: జీఎస్‌టీ, నోట్లరద్దు వల్ల మోదీ సర్కారుపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో విడుదలైన ప్రపంచ బ్యాంకు నివేదిక కేంద్ర ప్రభుత్వ౦లో, అటు బీజేపీ వర్గాల్లోనూ ఆనందం వెల్లివిరిసేలా చేసింది. భారత వృద్ధిరేటును అప్‌గ్రేడ్‌ చేస్తూ ప్రపంచ బ్యాంకు అంచనాలను విడుదల చేసింది. ఈ ఏడాది భారత ఆర్థిక ప్రగతి 6.7 శాతం ఉంటుందని వరల్డ్ బ్యాంక్ వెల్లడించింది. భారత ప్రభుత్వం ఊహించిన 6.5 శాతం కన్నా ఎక్కువే ఉంటుందంటూ మోదీ సర్కార్‌కు భారీ ఊరటనిచ్చింది. ప్రపంచ ఆర్థికవ్యవస్థ మంచి సందేశాన్ని అందిస్తున్నా, అప్రమత్తంగా వ్యవహరించాలని వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ జిమ్ యంగ్ కిమ్ పేర్కొన్నారు.

2018-19 సంవత్సరంలో జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) 7.3 శాతం, 2019-20లో 7.5 శాతంగా ఉంటుందని కూడా ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. భారత్ మళ్లీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక దేశమని గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్‌లో వరల్డ్ బ్యాంక్ పేర్కొంది. జీఎస్టీ వల్ల వృద్ధిరేటు గత ఏడాది రెండవ భాగంలో సుమారు 0.1 శాతం తగ్గినట్లు రిపోర్ట్ పేర్కొన్నది. జీఎస్టీ వల్ల లాభాలు మెలమెల్లగా వస్తుంటాయని, నోట్ల రద్దు, జీఎస్టీ, మేకిన్ ఇండియా లాంటి కార్యక్రమాల వల్ల భారత్‌కు అనుకూల ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నట్లు వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది.





Untitled Document
Advertisements