టోక్యో, జనవరి 12 : హిమపాతం కారణంగా జపాన్ దేశం మంచుముద్దను తలపిస్తోంది. ఎటు చూసిన దట్టమైన మంచుమేటలే కనిపిస్తున్నాయి. భారీమంచుతో పాటు సరైన వెలుతురు లేని కారణంగా వాహనాలతో పాటు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జపాన్ పశ్చిమ తీర ప్రాంతంలో గురువారం సాయంత్రం 4.30 గంటల సమయంలో బయలుదేరిన ఓ రైలు భారీ హిమపాతం వల్ల రైల్వే ట్రాక్ పైనే నిలిచిపోయింది.
ఈ మేరకు అతిశీతల గాలుల దాటికి అస్వస్థతకు గురైన పలువురు ప్రయాణికులను రైల్వే సహాయక బృందాలు ఆసుపత్రికి తరలించారు. దాదాపు 15 గంటల పాటు రైలు కదలడానికి వీల్లేకపోయింది. దీంతో ప్రయాణికులు చుట్టూ మంచుతో ఉన్న ప్రాంతంలో రాత్రంతా రైల్లోనే గడపాల్సి వచ్చింది. రాత్రి పూట అంత మంచులో వేరే ప్రాంతానికి తరలించడం ప్రమాదం అని భావించిన అధికారులు ప్రయాణికులను అలాగే రైల్లోనే ఉంచారు.