మంగళగిరి, జనవరి 17: అమరావతి రాజధాని ప్రాంతమైన మంగళగిరిని మైటెక్ సిటీగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణ ఫలితాలు ఇస్తుంది. ఈ క్రమంలో మంగళగిరి ఎన్ఆర్టీ టెక్ పార్కు(13), ఆటోనగర్ ఐటీ పార్కు(3)ల్లో 16ఐటీ కంపెనీలను ఐటీ మంత్రి లోకేష్ ప్రారంభించారు. వీటి ఏర్పాటుతో తక్షణం 600 మందికి ఉపాధి లభిస్తుండగా ఏడాదిలో మరో 1600 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తారు.
సాంకేతిక విద్య చదివిన రాష్ట్ర యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రాజధాని అమరావతిలోనే అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. మంగళగిరి ఆటోనగర్ ఐటీ పార్కులో ఇప్పటికే మూడు ఐటీ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటిలో 500 మంది పని చేస్తున్నారు. హైదరాబాద్లో ఐటీ ప్రాంతం హైటెక్ సిటీగా పేరుగాంచిన విధంగా మంగళగిరిలో ఐటీ ప్రాంతం మైటెక్ సిటీగా అభివృద్ధి చెందుతుందని ఏపీ ఎన్ఆర్టీ సీఈవో రవి వేమూరి తెలిపారు.