నారావారిపల్లె, జనవరి 17: సంక్రాంతి పండక్కి ప్రతివారూ సొంత ఊళ్లకు వచ్చేలా ఒక నూతన సంప్రదాయానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. 15ఏళ్ల కిందట సంక్రాంతికి సొంతూరికి వెళ్లాల్సిందేనని తన సతీమణి పట్టుబట్టారని, తొలి రోజుల్లో ఇబ్బందిగా ఉండేదని, ఇప్పుడు అలవాటైందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ జన్మభూమి రుణం తీర్చుకోవాలని సూచించారు. 'ఉపాధి కోసం అమెరికా, ఆస్ట్రేలియా, బెంగళూరు వెళ్తున్నారు. సంక్రాంతి సమయంలో ప్రతి ఒక్కరూ గ్రామాలకు రావాలి. అందరూ గ్రామాలకు రావడంవల్ల నేడు నగరాలన్నీ ఖాళీ అయ్యాయి. గ్రామాలకు ఇలా రావడంవల్ల ఇక్కడ మౌలిక వసతులు అభివృద్ధి చెందుతాయి. నగరాల్లో ఉండే మౌలిక వసతులు గ్రామాల్లోనూ ఉండాలన్నదే నా ఆలోచన' అని పేర్కొన్నారు.
24 గంటలూ పని ఒత్తిడిలో ఉండేవారు గ్రామాలకు రావడంవల్ల ఒక కొత్త అనుభూతిని పొందుతారని, ఆనందంగా ఉండగలుగుతారని వివరించారు. గ్రామాల్లో ఇప్పటికే అన్ని ప్రాంతాల్లోనూ సీసీ రహదారుల నిర్మాణం చేపట్టామని, దీనివల్ల కొన్ని సమస్యలూ ఎదురవుతున్నాయని, కొన్ని మట్టి, మెటల్ రహదారులు ఉంటే బాగుంటుందని, లేకుంటే మోకాళ్ల సమస్య వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో ఎక్కువ ఆహారం తినడంవల్ల ప్రజలకు చక్కెర వ్యాధి వచ్చిందని, ఇప్పుడు సీసీ రహదారుల మీద నడవటంవల్ల మోకాళ్ల నొప్పులు వస్తున్నాయని, అవి పోవాలంటే కొంత మట్టి రహదారి ఉండాలని సీఎం పేర్కొన్నారు.