అమరావతి, జనవరి 20 : కలెక్టర్ల సదస్సులో చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించడం తగదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో తెదేపా సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రధాని మోదీని కలిశాక రాష్ట్ర హామీల విషయంలో ఒక స్పష్టత వచ్చిందని, హామీల సాధన కోసం కోర్టును ఆశ్రయించాలనుకోవడం తమకు ఉన్న హక్కు అంటూ నేతలకు సూచించారు.
హక్కులపై కోర్టుకు వెళ్తుంటే కొందరు భాజపాపై పోరాటంగా చిత్రీకరిస్తున్నారని, భాజపా ఇలాంటి వ్యాఖ్యలను వ్యతిరేకంగా భావించరాదన్నారు. ఒకవేళ కేంద్రం తమకు న్యాయం చేయలేదంటే చివరి అస్త్రంగా తాము కోర్టును ఆశ్రయిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇటీవల ఇండియా టుడే సదస్సులో కేసీఆర్ మాట్లాడిన మాటలను మరోసారి ప్రస్తావిస్తూ.. హైదరాబాద్ నగరాన్ని ధ్వంసం చేసినట్లు కేసీఆర్ అలా మాట్లాడడం సరికాదన్నారు.