జొహనెస్బర్గ్, జనవరి 23: స్వదేశంలో వరుస విజయాలతో రికార్డు సృష్టించిన టీమిండియా క్రికెట్ జట్టు, విదేశీ గడ్డపై మాత్రం ఎప్పటి మాదిరి చతికిలపడింది. మూడు టెస్ట్ ల ఫ్రీడమ్ సిరీస్ లో భాగంగా సఫారీ జట్టు ఇప్పటికే 2-0 తో సిరీస్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా భారత్ బౌలర్లు ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ ను కట్టడి చేసిన, కోహ్లి సేన బ్యాటింగ్ లో చాలా నిరాశపరిచింది. అంతే కాకుండా భారత్ తుది జట్టు ఎంపికపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి.
రేపు వాండరర్స్ వేదికగా మూడో నామమాత్రపు టెస్ట్ జరగనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఎలాగైనా గెలవాలని కసితో ఉంది. ఈ పిచ్ పై భారత్ జట్టుకు మంచి రికార్డు కూడా ఉంది. ఇక్కడ టీమిండియా నాలుగుసార్లు తలపడగా ఒక మ్యాచులో విజయం కైవసం చేసుకోగా మూడింటిని డ్రా చేసింది. మరో వైపు దక్షిణాఫ్రికా జట్టు రెండు టెస్ట్ లలో విజయం సాధించి ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తుంది. మరి ఈ ఆఖరి పోరులో కోహ్లీసేన ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో చూడాలి.