మెల్ బోర్న్, జనవరి 24 : సీజన్ తొలి గ్రాండ్ స్లాం ఆస్ట్రేలియా ఓపెన్ లో స్పెయిన్ వీరుడు నాదల్ కథ క్వార్టర్స్ లో ముగిసింది. ఇప్పటికే స్టార్ ఆటగాళ్లు టోర్నీ నుండి నిష్క్రమించగా ఇప్పుడు అదే వరసులో రఫా కూడా చేరాడు. మంగళవారం మారిన్ సిలిచ్ (క్రొయేషియా)తో హోరాహోరీ సాగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో స్పెయిన్ స్టార్, గాయంతో మ్యాచ్ ను మధ్యలోనే వదులుకున్నాడు. మరో వైపు మూడో సీడ్ దిమిత్రోవ్(బల్గేరియా)పై, బ్రిటన్ కుర్రాడు ఎడ్మండ్ గెలుపొందాడు.
మహిళా సింగిల్స్ లో ఉక్రెయిన్ క్రీడాకారిణి స్వితోలినకు, మెర్టిన్స్ (బెల్జియం) షాకిచ్చింది. మరో మ్యాచ్ లో రెండో సీడ్ కరోలినా వోజ్నియాకి (డెన్మార్క్), సురెజ్ నవారో (స్పెయిన్) ను ఓడించి సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)–తిమియా బాబోస్ (హంగేరి) ద్వయం క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.