కశ్మీర్, జనవరి 28 : జమ్మూకశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులపై సైన్యం కాల్పులు జరపడంతో ఇద్దరు పౌరులు మరణించారు. దీంతో వేర్పాటు వాదులు వారి మరణాన్ని నిరసిస్తూ.. బంద్కు పిలుపునిచ్చారు. అన్ని దుకాణాలు, వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడే స్తంభించిపోయిందని అధికారులు తెలిపారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ చర్యలు జరగకుండా ముందస్తు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు.
గోవాంపురా ప్రాంతంలో భద్రతా దళాల వాహన శ్రేణిపై నిరసనకారులు రాళ్ళు విసిరారు. వారిని అడ్డుకునే క్రమంలో ఈ కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. విషయం తెలిసిన జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ విచారం వ్యక్తం చేశారు. పూర్తి నివేదికను సమర్పించాల్సిందిగా సైన్యానికి రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశాలు జారీ చేశారు.