ముంబై, జనవరి 28 : ఎంఆర్ఐ స్కానింగ్ మెషీన్ లో ఇరుక్కొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముంబైలోని ఓ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ బట్టల షాపులో సేల్స్మెన్గా పనిచేస్తున్న రాజేశ్ అనే యువకుడు ఓ పేషంట్ను స్కానింగ్ నిమిత్తం నాయర్ హాస్పిటల్ కు తీసుకువెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆ పేషంట్తో పాటు రాజేశ్ సైతం స్కానింగ్ రూమ్కు వెళ్లాడు.
ఇంతలో రోగి దగ్గరున్న ఆక్సిజన్ సిలిండర్ను రాజేశ్ మోసుకుంటూ వస్తున్న క్రమంలో ఎంఆర్ఐ మెషీన్కి ఉన్న అయస్కాంత శక్తి ఒక్కసారిగా సిలిండర్ను ఆకర్షించింది. దీంతో రాజేశ్ కూడా లోపలికి దూరిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు ఆ ఆసుపత్రికి చేరుకొని ఆందోళన చేపట్టారు. ఆసుపత్రి యాజమాన్యం వల్లే తమ బిడ్డ చనిపోయాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.