హైదరాబాద్, జనవరి 29 : హైదరాబాద్ నగర శివార్లలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హత్యకు గురయ్యారు. మృతులలో అపర్ణ, ఆమె తల్లి విజయలక్ష్మి, కూతురు కార్తికేయిని ఉన్నారు. అపర్ణ తలపై ఎవరో గుర్తు తెలియని దుండగులు బరువైన వస్తువుతో మోది చంపేశారు. ఆమె మృతదేహం వంటగదిలోనే పడి ఉంది. అనంతరం ఆమె కూతురు, తల్లిపై విష ప్రయోగం చేసి చంపి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు అందించిన సమాచారం మేరకు.. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన అపర్ణ పదేళ్ల క్రితం నగరానికి వచ్చి ఇక్కడే స్థిరపడింది.
ఆమె కూకట్ పల్లికి చెందిన మధును ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. గత రెండేళ్లుగా వ్యక్తగత కారణాలతో అపర్ణ తన భర్తకు దూరంగా ఉంటోంది. రెండు రోజులుగా ఆమె ఇంటికి తాళం వేసి ఉందని పైగా అందులో నుండి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు గమనించి కిటికీ తెరిచి చూడగా.. వారి మృతదేహాలు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న సైబరాబాద్ జాయింట్ సీపీ షానవాజ్ ఖాసీం, మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్ లు కేసు నమోదు చేశారు. అపర్ణ ఫోన్ కాల్స్ లిస్టు ఆధారంగా దర్యాప్తు చేపడతామని, తన భర్త మధుపై అనుమానం ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మధు పరారీలో ఉన్నట్లు సమాచారం.