ముంబాయి, జనవరి 30: ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు రాఘవ లారెన్స్ నటించిన 'కాంచన' చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ తరువాత 2015లో దీనికి సీక్వెల్గా 'కాంచన 2' వచ్చింది. రాఘవ, తాప్సి, నిత్యా మేనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం తెలుగులో 'గంగ' పేరుతో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళు రాబట్టింది.
అయితే ఇప్పుడు ఈ సినిమా బాలీవుడ్లో రీమేక్గా రాబోతోంది. ఇందులో రాఘవ పాత్రలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర వర్గాలు సోషల్మీడియా వేదికగా వెల్లడించాయి. క్రిఅర్జ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ప్రేరణా అరోరా, అర్జున్ కపూర్ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్లో సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ప్రస్తుతం అక్షయ్ నటించిన 'ప్యాడ్మ్యాన్' చిత్రం విడుదలకు సిద్ధమైంది.