అమరావతి, ఫిబ్రవరి 1: రాష్ట్ర ప్రభుత్వం సాంకేతికతను వినియోగించుకోవడంలో కొత్త పంథాలను అనుసరిస్తుంది. తాజాగా పౌరులకు కేంద్ర ప్రభుత్వం ఆధార్ నంబర్ కేటాయిస్తున్నట్లు మాదిరి గానే ‘భూధార్’ ఇవ్వనున్నట్లు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పొలాలు, స్థలాలకు ‘భూధార్’ పేరుతో విశిష్ట గుర్తింపు సంఖ్యను అమలు చేసేందుకు సర్కారు ఏర్పాట్లు చేస్తోంది.
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ లో 12 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య ఉంటుంది. భూధార్ విధానంలో ప్రతి స్థిరాస్తికి 11 అంకెలతో కూడిన నంబరు కేటాయిస్తారు. ఇందులో మొదటి రెండు అంకెలు రాష్ట్రానికి సంబంధించిన సెన్సెస్ కోడ్ కాగా తర్వాత తొమ్మిది అంకెలు ఉంటాయి.
ప్రజల ఆస్తులకు భద్రత కల్పించడంలో భాగంగా దేశంలోనే తొలిసారిగా భూసేవ పేరుతో భూధార్ కార్యక్రమం చేపడుతున్నట్లు కేఈ కృష్ణమూర్తి తెలిపారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని 24 గ్రామాలు, ఉయ్యూరు మున్సిపాలిటీలో ఇప్పటికే చేపట్టిన భూధార్ పైలట్ ప్రాజెక్టును ఫిబ్రవరి 15 కల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.