సాహో.. సారథి..

     Written by : smtv Desk | Fri, Feb 02, 2018, 11:18 AM

సాహో.. సారథి..

డర్బన్, ఫిబ్రవరి 2 : భారత్- సౌతాఫ్రికాల మధ్య ఆరు వన్డేల సిరీస్ లో భాగంగా డర్బన్ లో జరిగిన తొలి వన్డేలో టీమిండియా చిరస్మరణీయమైన విజయం దక్కించుకుంది. టెస్ట్ సిరీస్ కోల్పోయిన అవమానమో, చివరి టెస్ట్ గెలిచిన ఆత్మవిశ్వాసమో గాని కోహ్లిసేన సఫారీలకు షాకిచ్చింది. మ్యాచ్ ఆద్యంతం కోహ్లి(112), రహనే(79) చూడముచ్చటైన షాట్లతో అభిమానులను అలరించారు.

టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న ప్రోటిస్ జట్టులో కెప్టెన్ డుప్లెసిస్ (120) శతకంతో ఆకట్టుకున్నాడు. చివరిలో మోరిస్(37), ఫెలుక్వాయో (27 నాటౌట్‌), పరుగులు చేయడంతో నిర్ణీత ఓవర్లలో సౌతాఫ్రికా జట్టు ఎనిమిది వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. భారత్ బౌలర్లలో యాదవ్ మూడు, చాహల్ రెండు, వికెట్లు దక్కించుకోగా, బుమ్రా, భువనేశ్వర్, తలో వికెట్ తీశారు.

అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన టీమిండియా మొదటిలో రోహిత్ శర్మ(20) పెవిలియన్ కు చేరగా, శిఖర్ ధావన్(30) కోహ్లి తప్పిదం వల్ల రనౌట్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కెప్టెన్ తో జత కలిసిన రహనే అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఈ క్రమంలో భారత సారథి 106 బంతుల్లో తన కెరీర్ లో 33వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

ఆఖరిలో కోహ్లి, రహనే ఔటైన పాండ్య (3, నాటౌట్), ధోని(7, నాటౌట్) నిలవడంతో 45.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించారు. చివరిలో ధోని ఫోర్ తో విన్నింగ్ షాట్ కొట్టడం కొసమెరుపు. శతకం సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. సిరీస్ లో భాగంగా రెండో వన్డే ఈ ఆదివారం సెంచూరియన్ వేదికగా జరగనుంది.





Untitled Document
Advertisements