తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా పలు రాజకీయ, సిని ప్రముఖులు కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. కాసేపట్లో ఫిలింనగర్ లోని విశ్వనాథ్ నివాసానికి కేసీఆర్ వెళ్లనున్నారు. ఆయన పార్థివ దేహానికి నివాళి అర్పించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. పంజాగుట్ట శ్మశానవాటికలో కాసేపట్లో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. విశ్వనాథ్ మృతికి సంతాపంగా ఈరోజు షూటింగ్ లను స్వచ్ఛందంగా ఆపేశారు.
మరోవైపు ట్విట్టర్ ద్వారా కేసీఆర్ స్పందిస్తూ.. అతి సామాన్యమైన కథనైనా తమ అద్భుత ప్రతిభతో వెండి తెర దృశ్య కావ్యంగా మలిచే అరుదైన దర్శకులు శ్రీ కె. విశ్వనాథ్ అని కొనియాడారు. దాదా సాహెబ్ ఫాల్కే, రఘుపతి వెంకయ్య వంటి అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులతో సత్కారం వారి దర్శక ప్రతిభకు నిదర్శనమని అన్నారు. తెలుగు సినిమా ఉన్నన్ని రోజులు విశ్వనాథ్ పేరు నిలిచి ఉంటుందని చెప్పారు.