మౌంట్ మౌంగనుయ్, ఫిబ్రవరి 3 : టీమిండియా యువ ఆటగాళ్లు భారత్ కీర్తి పతాకాన్ని న్యూజిల్యాండ్ లో ఎగురవేశారు. ఈ రోజు ఆస్ట్రేలియాతో జరిగిన అండర్-19 ఫైనల్లో జగజ్జేతగా నిలిచిన మన యువకెరటాలు ప్రతి భారతీయుడిని ఆనందంలో ముంచారు. వీరి విజయంకు బీసీసీఐ జట్టులో ప్రతి ఆటగాడికి రూ. 30 లక్షలు, కోచ్ రాహుల్ ద్రావిడ్ కు రూ. 50 లక్షలు నజరానా ప్రకటించింది.
2000, 2008, 2012 సంవత్సరాల్లో, అండర్-19 విజేతగా నిలిచిన భారత్ ఈ విజయంతో నాలుగోసారి కప్ ను కైవసం చేసుకొని చరిత్ర లిఖించింది. ఇంతటి ఘనవిజయం సాధించిన భారత్ జట్టు పై పలువురు ప్రముఖులు, అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా అభినందనలు తెలుపుతున్నారు.