జైపూర్, ఫిబ్రవరి 3 : రాజ్పుత్ మహారాణి పద్మిని జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన "పద్మావత్" చిత్రంపై నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. తాజాగా కర్ణిసేనకు చెందిన కొందరు ప్రముఖులు ఈ చిత్రాన్ని చూసి మనసు మార్చుకున్నారు. అంతేకాదు ఇకపై ఆందోళనలను చేయనంటూ స్పష్టం చేశారు. ముంబైలో "పద్మావత్" సినిమాను చూసిన రాజ్పుత్లు.. సినిమా తమ గౌరవాన్ని మరింత పెంచేలా ఉందని, ప్రతి రాజ్పుత్ ఈ సినిమా చూసి గర్వపడతారని అన్నారు. సినిమాలో ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ, రాణి పద్మినీల మధ్య అభ్యంతరకర సన్నివేశాలేమీ లేవని యోగేంద్ర సింగ్ స్పష్టంచేశారు. ఇకపై కర్ణిసేన సినిమాపై ఎలాంటి ఆందోళనలు చేపట్టదని వెల్లడించారు. అలాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్లతో పాటు దేశవ్యాప్తంగా సినిమా ప్రదర్శనకు సహకరిస్తామని ప్రకటించారు.