మెగా ఫ్యామిలీ నుండి చాలామంది హీరోలు తెర మీద కనిపిస్తున్నారు. నేటి తరం వారసుల సినిమాల విషయంలో నిన్నటి తరం హీరోలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అందుకు ఉదాహరణ సాయితేజ్ తన కెరియర్ విషయంలో తన మేనమామలు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ వచ్చారనే విషయాన్ని చాలా ఇంటర్వ్యూలలో చెప్పాడు. హీరోగా తనని తాను మలచుకోవడానికి అవసరమైన టిప్స్ ను చిన్నమామయ్య చెబుతూ వచ్చాడనే విషయాన్ని రీసెంట్ గా 'అన్ స్టాపబుల్ 2' స్టేజ్ పై కూడా చెప్పాడు.
సాయితేజ్ కి కొంతకాలం క్రితం జరిగిన యాక్సిడెంట్ వలన, ఆయన కాస్త గ్యాప్ తీసుకోవలసి వచ్చింది. ఈ మధ్యలోనే చాలామంది కొత్త హీరోలు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ కారణం చేత ప్రస్తుతం ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కొరకు సాయితేజ్ మరింత కష్టపడవలసి ఉంది. అతనికి తగిన ఊతాన్ని ఇవ్వడానికి గాను పవన్ తనవంతు ప్రయత్నాన్ని చేస్తున్నాడని అంటున్నారు.
సాయితేజ్ తాజా చిత్రమైన 'విరూపాక్ష' చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. ఈ సినిమా అవుట్ పుట్ ఎలా వస్తుందనేది పవన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే వస్తున్నాడట. అంతేకాదు తన తాజా చిత్రమైన 'వినోదయ సితం' రీమేకులోను సాయితేజ్ ఉండేలా చూసుకున్నాడు. నిజానికి పవన్ ఇటు రాజకీయంగా.. అటు ఆయన సినిమాల పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. అంత బిజీ షెడ్యుల్ లోనూ మేనల్లుడి కెరీర్ పై శ్రద్ధ పెట్టడం అనేది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే. దీనిని బట్టి ఆయన కుటుంబానికి ఇచ్చే విలువ అర్ధం చేసుకోవచ్చు అంటున్నారు ఫ్యాన్స్.