న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3 : సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడటంతో అధికార బీజేపీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టాలని చూస్తుంది. ఒక వైపు హస్తం పార్టీ రాష్ట్రాల్లో తమ ప్రాబల్యాన్ని పెంచుకుంటూ పోతుంది. దీంతో కదిలిన కషాయిదళం 1980-90 కాలంలో రాజీవ్ గాంధీ హయంలో జరిగిన బోఫోర్స్ శతఘ్నుల కుంభకోణాన్ని మరోసారి కదిలించింది. అప్పటిలో ఈ భారీకుంభకోణం 1989 లో కాంగ్రెస్ పతనానికి దారి తీసింది.
ఆ కేసులో మాజీ ప్రధాని రాజీవ్గాంధీ కూడా తొలుత నిందితుడే.. అయితే ఆయన 1991లో మానవబాంబు పేలుడులో ఆయన మరణించడంతో జాబితాలో పేరును తొలగించారు. అయితే ఈ అప్పీలు దాఖలు చేయవద్దని, కేసు కాలదోషం పట్టిపోయిందని, ఇంత ఆలస్యంగా ఎందుకు అప్పీలు చేశారనడానికి మనం సహేతుకమైన కారణాలు చూపలేమని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కేంద్రానికి సలహా ఇచ్చారు. కానీ కేంద్రం ఈ సలహాను పెడచెవిన పెట్టింది.
మరోవైపు కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ జడ్జి లోయా మృతిపై లోతైన విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పరచాలని కేవలం మూడు రోజుల కిందటే డిమాండ్ చేశారు. ఈ కేసులో ఉగ్రవాది సొహ్రబుద్దీన్ షేక్ బూటకపు ఎన్కౌంటర్ కేసు ను విచారిస్తున్న లోయా 2014లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆ ఎన్కౌంటర్లో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నిందితుడు.
లోయా మృతి చెందిన నెలరోజులకే అమిత్ షా కు క్లీన్చిట్ లభించడం పలు అనుమానాలకు రాజకీయ దుమారానికి తావిచ్చింది. కాగా జడ్జి లోయా మృతి కేసుపై కాంగ్రెస్ ఈ మధ్య చేసిన ఆరోపణలపై ప్రతిదాడికే బీజేపీ బోఫోర్స్కు మళ్ళీ జీవం పోసిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.