బిజేపీ తీర్థం పుచ్చుకోబోతున్న కర్ణాటక స్టార్ హీరో

     Written by : smtv Desk | Wed, Apr 05, 2023, 10:55 AM

బిజేపీ తీర్థం పుచ్చుకోబోతున్న కర్ణాటక స్టార్ హీరో

సినిమా తారలకు మరియు రాజకీయాలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఒకవైపు సినీరంగంలో రాణిస్తూనే మరోవైపు రాజకీయాలలో సైతం చక్రం తిప్పుతూనే ఉంటారు. అదేవిధంగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు పలువురు కన్నడ మూవీ స్టార్లు కాషాయ తీర్థం పుచ్చుకుంటున్నారు. ప్రముఖ నటుడు కిచ్చా సుదీప్, దర్శన్ తుగుదీపా నేడు బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. బీజేపీ వర్గాల ప్రకారం.. వీరిద్దరూ ఈ రోజు మధ్యాహ్నం 1.30, 2.30 గంటలకు బెంగళూరులోని ఓ ప్రైవేటు హోటల్‌లో కాషాయ కండువా కప్పుకోబోతున్నారు.

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, ఇతర నేతల సమక్షంలో వీరు పార్టీలో చేరబోతున్నారు. మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, 13న ఓట్లను లెక్కిస్తారు. కర్ణాటకలో వరుసగా రెండోసారి కూడా కాషాయ కండువాను ఎగరవేయాలని చూస్తున్న బీజేపీ ఈసారి స్టార్ క్యాంపెయినర్లుగా సినీ స్టార్లను రంగంలోకి దించుతోంది. వారిలో ‘విక్రాంత్ రోణ’ నటుడు కిచ్చా సుదీప్ ఒకరు.

51 సంవత్సరాల కిచ్చా సుదీప్ నాయక సామాజిక వర్గానికి చెందినవారు. ఇది రాష్ట్రంలో షెడ్యూల్ కులాల కిందకు వస్తుంది. కల్యాణ-కర్ణాటక ప్రాంతంలో నాయక సామాజిక వర్గం పెద్ద సంఖ్యలో ఉంది. దీనికి తోడు సుదీప్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది.

కాగా, కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ఫిబ్రవరిలో కిచ్చా సుదీప్‌ను ఆయన నివాసంలో కలిశారు. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరబోతున్నారన్న వార్తలు వైరల్ అయ్యాయి. అయితే, వారిద్దరి కలయికకు రాజకీయ ప్రాధాన్యం లేదని, వ్యక్తిగత కారణాలతో కలిశారని సుదీప్ సన్నిహితులు తెలిపారు.





Untitled Document
Advertisements