వేసవికాలం ఎండలు బంబెలేత్తిస్తున్నాయి. అసలు మండే ఎండల్లో ఇంట్లో నుండి కాలు బయట పెట్టాలి అంటే ఒంట్లో వణుకు మొదలవుతుంది. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లక తప్పదు. అలా వెళ్ళినప్పుడు తగురీతిలో జాగ్రత్తలు పాటించకుంటే వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. కనుక బయటకు వెళ్ళినప్పుడు మంచినీళ్ళ సీసా, గొడుగు వెంట తీసుకెళ్లడం తప్పనిసరి. అలాగే సాధారణంగా బయట ఎండలో ఎక్కువసేపు ఉండి తిరిగి ఇంట్లోకి రాగానే చీకటిగా అనిపిస్తుంది. అయితే ఇలా చీకటిగా అనిపించడానికి గల కారణం వెలుతురుని బట్టే మన కళ్ళు (రెటీనా పోర)లో మార్పు వస్తుంది. వెలుతురు ఎక్కువగా ఉన్నప్పుడు కంటిపాపలు చిన్నవిగాను, తక్కువగా ఉన్నప్పుడు కంటిపాపలు పెద్దవిగాను ఉంటాయి. అయితే ఎండ తీవ్రత వల్ల కంటిపాపలు చిన్నవవుతాయి. ఎండలో నుంచి ఇంట్లోకి వచ్చినప్పుడు మన కంటిపాపలు చిన్నవిగానే ఉండటం వల్ల వెంటనే మన కళ్ళకు ఏ వస్తువులూ కనిపించవు. అంతా చీకటిగా అనిపిస్తుంది. మన కంటి పాపలు పెద్దగా మారడానికి కొంచెం సమయం పడుతుంది. ఆ తర్వాతే కళ్ళు మామూలు స్థితికి వస్తాయి. కనుక బయట నుండి తిరిగి ఇంట్లోకి వచ్చినప్పుడు కళ్ళకు చీకటి కమ్మిన కంగారుపడకుడదు. ఎందుకంటే కాసేపటికి తిరిగి ఎదాస్థితికి చేరుకుంటాం కనుక.