అతిగా స్మార్ట్ ఫోన్ వినియోగించే పిల్లల్లో పెద్దయ్యాక సంభవించేది ఇదే

     Written by : smtv Desk | Sat, May 20, 2023, 12:24 PM

అతిగా స్మార్ట్ ఫోన్ వినియోగించే పిల్లల్లో పెద్దయ్యాక సంభవించేది ఇదే

ప్రస్తుతకాలంలో మన రోజువారీ జీవితంలో స్మార్ట్ ఫోన్ అనేది ఒక భాగంగా మారిపోయింది. ఫోన్ చేతిలో లేనిదే క్షణమైనా గడవని పరిస్థితుల్లోకి వచ్చేసాము. ఈ రోజుల్లో పెద్దవాళ్లతో పాటు చిన్న పిల్లలు సైతం ఫోన్లకు అతుక్కుపోతున్నారు. స్నేహితులతో ఆటలాడుతూ, పుస్తకాలతో కాలక్షేపం చేయాల్సిన చిన్నారులు మొబైల్ గేమ్స్ లో మునిగిపోతున్నారు. వివిధ షోలు చూస్తున్నారు. సోషల్ మీడియాలోనూ మితిమీరిన ప్రమేయం తల్లిదండ్రులకు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఇలా చిన్నారులు స్మార్ట్ ఫోన్లను అతిగా వాడటం వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వైద్యులు అంటున్నారు. ఇప్పుడు ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ షావోమీ ఇండియా మాజీ హెడ్ మను కుమార్ జైన్ దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఓ కంపెనీకి మాజీ అధిపతి అయిన ఆయనే స్వయంగా ‘మీ పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌లు ఇవ్వడం ఆపండి’ అంటూ తన లింక్‌డిన్ లో సందేశం రాశారు. ఒక ప్రయోగశాల చేసిన అధ్యయనం సమాచారాన్ని పంచుకుంటూ స్మార్ట్ ఫోన్ల వాడకం విషయంలో తల్లిదండ్రులను హెచ్చరించారు.

‘ఒక స్నేహితుడు సపియోన్ ల్యాబ్స్ నుంచి ఈ నివేదికను నాతో పంచుకున్నాడు. ఇది చిన్నప్పుడు స్మార్ట్‌ఫోన్లు (టాబ్లెట్లు కూడా) అతిగా వాడే వారు పెద్దయ్యాక మానసిక రుగ్మతలతో బాధపడుతారని తెలిపింది. ఈ అధ్యయనం నుంచి వచ్చిన సంఖ్యలు నిజంగా దిగ్భ్రాంతిని కలిగిస్తాయి. ఎందుకంటే 10 ఏళ్లలోపు స్మార్ట్‌ఫోన్లకు బానిసలైన వారిలో 60-70 శాతం మంది బాలికలు పెద్దయ్యాక మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అబ్బాయిల్లో సుమారు 45-50 శాతం మంది తర్వాతి జీవితంలో ఇలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారు. కాబట్టి పిల్లలు ఏడుస్తున్నప్పుడు, భోజనం చేసేటప్పుడు, కారులో ప్రయాణిస్తున్నప్పుడు అల్లరి చేస్తే బుజ్జగించడానికి స్మార్ట్ ఫోన్లను ఇచ్చే అలవాటను తల్లిదండ్రులు మానుకోవాలి. దీనికి బదులుగా వారితో ఎక్కువగా మాట్లాడుతూ, బయట ఆటలాడేలా ప్రోత్సహించాలి. పిల్లలను వారి అభిరుచులలో నిమగ్నం చేయడం మంచిది’ అని జైన్ చెప్పుకొచ్చారు.





Untitled Document
Advertisements