ప్రస్తుతకాలంలో దాదాపు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కచ్చితంగా ఉంటుంది. ఈ ఇంటర్నెట్ యుగంలో మనకు ఎ విషయం పై సమాచారం కావాలి అన్న వెంటనే ఫోన్ లో సెర్చ్ చేసి దాని గురించి తెలుసుకోవడమే. యుట్యుబ్ వీడియోలలో మనకు కావలసినంత సమాచారం అందుబాటులో ఉంటుంది. అయితే యూట్యూబ్ లో ఏదైనా వీడియో ఓపెన్ చేయగానే ముందు రెండు ప్రకటనలు కనిపిస్తాయి.. పదిహేను సెకన్ల పాటు ఈ ప్రకటనలు చూశాకే సదరు వీడియో మొదలవుతుంది. ఈ యాడ్లు విసిగిస్తున్నాయంటూ వాపోతున్న యూట్యూబ్ ప్రేక్షకులను మరింత విసిగించే నిర్ణయాన్ని గూగుల్ యాజమాన్యం తీసుకుంది. ఇకపై యాడ్లు ముప్పై సెకన్ల పాటు కనిపించనున్నాయి. అదికూడా స్కిప్ చేసే అవకాశం లేకుండా మొత్తం చూడాల్సిందేనని తెలిపింది. ఈమేరకు కనెక్టెడ్ టీవీలో ప్రకటనలు మొత్తం చూశాకే వీడియో మొదలయ్యేలా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపింది.
టీవీ స్క్రీన్ పై యూట్యూబ్ కంటెంట్ చూసేవారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతోంది. దీంతో వివిధ కంటెంట్ లు ప్రసారమయ్యే సమయంలో ఇచ్చే యాడ్స్ ను గూగుల్ పెంచింది. ప్రకటనకర్తల లక్ష్యాలకు అనుగుణంగా బిగ్ స్క్రీన్ పై ఎక్కువ నిడివి ఉన్న యాడ్స్ ను ప్రదర్శించనున్నట్లు గూగుల్ తెలిపింది. ఇప్పటి వరకు ఉన్న పదిహేను సెకన్ల నాన్ స్కిప్ యాడ్స్ స్థానంలో 30 సెకన్ల యాడ్స్ ను ప్రసారం చేయనున్నట్లు ఓ బ్లాగ్ పోస్ట్ లో గూగుల్ తెలిపింది.