గోమూత్రంతో కర్ణాటక విధాన సౌధ శుద్ధి కార్యక్రమం.. కాంగ్రెస్ కార్యకర్తలు

     Written by : smtv Desk | Mon, May 22, 2023, 01:09 PM

గోమూత్రంతో కర్ణాటక విధాన సౌధ శుద్ధి కార్యక్రమం..  కాంగ్రెస్ కార్యకర్తలు

తాజాగా కర్ణాటకలో జరిగిన ఎన్నికలలో అత్యధిక మేజారీటితో గెలుపొంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కర్ణాటకలో బీజేపీ అవినీతి పాలన ముగిసిందంటూ కాంగ్రెస్ నాయకులు విధానసౌధను ‘శుద్ధి’ చేశారు. సోమవారం నాయకులు, కార్యకర్తలు విధాన సౌధ ఆవరణలో ఆవు మూత్రంతో శుద్ధి చేశారు. ఈ సందర్భంగా పూజ కూడా చేశారు. తాము విధాన సౌధను శుద్ధి చేస్తున్నామని ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బీజేపీ తన అవినీతితో అసెంబ్లీని కలుషితం చేసిందని కాంగ్రెస్ పార్టీ గతంలో ఆరోపించింది. విధాన సౌధను గో మూత్రంతో శుభ్రపర్చే సమయం వచ్చిందని ఈ ఏడాది జనవరిలో కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ చెప్పారు. ‘‘మేం విధాన సౌధను శుభ్రం చేయడానికి కొంత డెటాల్‌తో వస్తాం. నా దగ్గర శుద్ధి చేయడానికి కొంత ఆవు మూత్రం కూడా ఉంది’’ అని నాడు చెప్పారు. బీజేపీ హయాంలో అవినీతితో అసెంబ్లీ కలుషితమైందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఈ ‘శుద్ధి’ కార్యక్రమం నిర్వహించారు.

కర్ణాటక ఎన్నికలు మే 10న జరగ్గా.. ఫలితాలు 13న వచ్చాయి. 135కి పైగా సీట్లతో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పోటీ పడ్డారు. వారం రోజుల సందిగ్ధత తర్వాత సోనియా గాంధీ జోక్యంతో.. 20వ తేదీన సీఎంగా సిద్ధూ, డిప్యూటీ సీఎంగా డీకే ప్రమాణ స్వీకారం చేశారు.





Untitled Document
Advertisements