అలనాటి అందాల నటుడు శరత్ బాబు కాసేపటి క్రితం హైదరాబాద్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వేల్లదిన్చ్చారు. శరత్ బాబు వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే ఆయన సినీనటి రమాప్రభను మొదట పెళ్ళి చేసుకున్నారు. కొన్నేళ్ల తర్వాత ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. నాయికగా రమాప్రభ రాణించలేకపోయినప్పటికీ... 1970లలో ఆమె స్టార్ కమెడియన్ గా వెలుగొందారు. సినీ పరిశ్రమలోకి రావాలనుకుంటున్న ఎంతో మందికి ఆమె అండగా నిలిచారు. కొందరికి ఆర్థికంగా సాయం చేయడం, మరికొందరికి తన ఇంట్లో ఆశ్రయం ఇవ్వడం వంటివి ఆమె ఎన్నో చేశారు.
'కన్నెవయసు' సినిమాలో హీరోగా నటించిన లక్ష్మీకాంత్ కు శరత్ బాబు స్నేహితుడు. ఆయన ద్వారానే రమాప్రభకు శరత్ బాబు పరిచయం అయ్యారు. తొలినాళ్లలో శరత్ బాబుకు సినిమాల్లో అవకాశాల కోసం రమాప్రభ ఎంతోమందికి రెకమెండ్ చేశారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఏదో వ్యవహారం నడుస్తోందనే వార్తలు షికార్లు చేశాయి. దీంతో, ఆ పుకార్లను నిజం చేద్దామని రమాప్రభను శరత్ బాబు కోరడం, ఆమె ఓకే చెప్పడం జరిగిపోయాయి. అలా వారిద్దరూ భార్యాభర్తలు అయ్యారు.
పెళ్లి అయిన తర్వాత ఇద్దరూ రెండు చిత్రాలను నిర్మించారు. ఆ రెండు సినిమాలు మంచి లాభాలను గడించాయి. అయితే ఆ తర్వాత ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల కారణంగా మనస్పర్థలు వచ్చాయి. రమాప్రభకు అప్పట్లోనే కోట్ల రూపాయల ఆస్తులను ఇచ్చానని శరత్ బాబు చెప్పేవారు. తన ఆస్తులను మోసం చేసి ఆయన పేరిట రాయించుకున్నారని రమాప్రభ అనేవారు. వీరిద్దరి వాదనల్లో ఏది నిజమో కచ్చితంగా తెలియనప్పటికీ.. ఇద్దరూ విడాకులు తీసుకుని దాంపత్య జీవితానికి ముగింపు పలికారు.