తెలుగు పరిశ్రమకు చెందిన దర్శకులలో తేజ స్థానం ప్రత్యేకం. ప్రేమకథా చిత్రాలపై తనదైన ముద్రను చూపిస్తూ వచ్చిన దర్శకుడు. తన చిత్రాల ద్వారా చాలామంది హీరోలను పరిచయం చేసిన రికార్డు ఆయన పేరుతో ఉంది. అలాంటి తేజ నుంచి త్వరలో 'అహింస' అనే పేరుతో ఓ చిత్రం వెండితెర మీదకు రానుంది. ఈ సినిమాతో ఆయన దగ్గుబాటి అభిరామ్ ను హీరోగా పరిచయం చేస్తున్నారు.
తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తేజ మాట్లాడుతూ .. "పెద్ద హీరోలతో నేను సినిమాలు చేయలేదు .. చేద్దామని నేను ఎవరినీ అడగనూ లేదు. ఇంతవరకూ చేస్తూ వచ్చిన సినిమాల్లో నాకు షేర్ ఉండేది. ఇక త్వరలో పూర్తి నిర్మాతగా మారతాను. కొత్త దర్శకులకు .. హీరోలకు అవకాశాలు ఇస్తాను" అని అన్నారు.
అదే విధంగా తన కుమారుడి గురించి మాట్లాడుతూ "మా అబ్బాయిని హీరోగా పరిచయం చేయాలనుకుంటున్నాను. ఫారిన్ లో అందుకు సంబంధించిన కోర్సులు చేసి వచ్చాడు. చూడటానికి హ్యాండ్సమ్ గానే ఉంటాడు. అయితే హ్యాండ్సమ్ ఉండగానే సరిపోదు. నటన తెలియాలి ... తనకంటూ ఒక స్టైల్ ఉండాలి .. అప్పుడే హీరోగా నిలబడతారు. మా అబ్బాయి సినిమాను నేను డైరెక్ట్ చేయాలా? వేరేవారికి అప్పగించాలా? అనేది ఇంకా ఆలోచించలేదు" అని చెప్పుకొచ్చారు.