హైదరాబాద్, ఫిబ్రవరి 4 : ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ నాయకులు, ప్రజలు అత్యధికంగా చర్చించుకుంటున్న అంశం "ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా". కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్ లో ఆంధ్రకు నిరాశ ఎదురైన విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై హీరో నిఖిల్ సోషల్మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లబుచ్చారు. ప్ర్యతేక హోదా గురించి మాట్లాడితే అందరూ ‘ఇవన్నీ నీకెందుకు?’ అని అంటున్నారని కానీ ఓ నటుడిగా దీని గురించి మాట్లాడాల్సిన బాధ్యత తనపై ఉందని ట్వీట్ చేశారు.
‘కేవలం నేను ఓ నటుడినే. కానీ ఏపీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే ‘నీకు ఇవన్నీ ఎందుకు?’ అని అడుగుతున్నారు. నేను ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాల్లో షూటింగ్లలో పాల్గొన్నాను. ఏపీ అభివృద్ధి చెందడానికి ఇంకా చాలా చేయాల్సి ఉందని నాకు అప్పుడు అనిపించింది. ఇది జరగాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా నిధులు కావాలి. ఓ భారతీయుడిగా, తెలుగు వ్యక్తిగా స్పందిస్తున్నాను’ అని నిఖిల్ ట్వీట్లో తెలిపారు.