నెల్లూరు, ఫిబ్రవరి 5: నెల్లూరులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ అధికారులు రూ.కోటి 43 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గౌహతి నుంచి చెన్నై వెళ్తున్న రైలులో విజయవాడ ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో భాగంగా నెల్లూరు రైల్వేస్టేషన్లో ఈ బంగారం దొరికింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు నెల్లూరు వద్ద గ్యాస్ స్టౌ బర్నర్ లో బంగారం నింపి తరలిస్తుండటాన్ని గమనించిన అధికారులు 4.658 కిలోల బంగారాన్ని గుర్తించారు. బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విజయవాడ డీఆర్ఐ కార్యాలయానికి తరలించి విచారణ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.