చెన్నై, ఫిబ్రవరి 8 : కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం చేసిన అనంతరం అతని చిత్రాల కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘2.ఓ’ చిత్రం విడుదల మీద ఇప్పటికే స్పష్టమైన తేది ఖరారు కాలేదు.
నిర్మాణాంతర పనులు పూర్తికాకపోవడంతో ఏప్రిల్ 14వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిపారు. ఇప్పుడు గ్రాఫిక్స్ పనులకు సమయం పట్టే అవకాశముందని కోలీవుడ్ వర్గాల సమాచారం.‘2.ఓ’ తర్వాతే రంజిత్ దర్శకత్వంలోని ‘కాలా’ను విడుదల చేయనున్నట్లు గతంలో వెల్లడించారు.
ఇప్పుడు ‘కాలా’ ముందుగానే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముంబయి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం సమ్మర్ కానుకగా ఏప్రిల్ 14న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని రజనీకాంత్ అల్లుడు ధనుష్ తన వండర్బార్ ఫిలిమ్స్ బ్యానరుపై నిర్మిస్తున్నారు.