న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10 : పగడ దీవులైన మాల్దీవులలో ఆ దేశ అధ్యక్షడు యమీన్ నియంతృత్వ ధోరణితో రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు తీర్పుని ధిక్కరించి యమీన్ ఏకంగా ప్రధాన న్యాయమూర్తినే అరెస్ట్ చేయించారు. కాగా ఈ విషయంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.
ఆ దేశ సుప్రీం తీర్పును ప్రతిఒక్కరూ గౌరవించాలని భారత్ తన అభిప్రాయాన్ని వెల్లబుచ్చింది. మరో వైపు చైనా భారత్ ఈ విషయంలో జోక్యం చేసుకోకపోవడమే మంచిదని చెపుతుంది. కొద్దిరోజుల క్రితం మాల్దీవులు అధ్యక్షుడు మిత్ర దేశాలైన చైనా, పాక్, సౌదీలకు రాయబారులను పంపుతున్నట్లు చెప్పడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
డ్రాగన్ దేశం ఎప్పటినుంచో హిందూ మహాసముద్రంలో తన ఆధిపత్యాన్ని పెంచుకొని భారత్ను ఒంటరిని చేయాలని పావులు కదుపుతుంది. భారత్ హిందూ మహాసముద్రంలో తన ఆధిపత్యం తగ్గకుండా ముందుకు కదులుతుంది. ‘ యామీన్ గత కొంతకాలంగా తన రాజకీయ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయనకు చైనా ఆర్థికంగా అండదండలు అందిస్తోంది. భారత్ ఎప్పుడూ ప్రజాస్వామ్య శక్తుల వెనకాలే ఉంటుంది. అయితే మాల్దీవులు.. చైనా చేతుల్లో చిక్కుకుండా భారత్ ప్రయత్నించాల్సిన అవసరం ఉంది’ అని బ్రూకింగ్స్ ఇండియా ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.