హైదరాబాద్, ఫిబ్రవరి 10 : బోదకాలు బాధితులను ఆదుకోవాలంటూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది. వారికి నిత్యావసరాల నిమిత్తం నెలకు వెయ్యి రూపాయల పింఛనుతో పాటు అవసరమైన మందులు, ఇతర వైద్య సహకారం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. వైద్య ఆరోగ్యశాఖపై ప్రగతిభవన్లో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే ఆర్ధిక సంవత్సరం నుండి బోదకాలు బాధితులకు పింఛను కోసం బడ్జెట్లో నిధులు కేటాయిస్తామన్నారు.
తమ తమ నియోజకవర్గాల్లో బోదకాలు బాధితులు చాలామంది ఉన్న నేపథ్యంలో వారిని ఆదుకోవాలని ఎంపీ కవిత సహా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పలువురు ప్రజాప్రతినిధుల నుంచి వినతులు వెల్లువెత్తడంతో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ప్రవేశపెట్టిన కిట్స్ పథకం అద్భుతంగా అమలవుతు౦దన్న ఆయన ప్రజారోగ్యం విషయంలో తెలంగాణ ఆదర్శంగా మారాలన్నది తమ లక్ష్యమని కేసీఆర్ స్పష్టం చేశారు.