జొహానెస్బర్గ్, ఫిబ్రవరి 11 : ఆరు వన్డేల సిరీస్ లో భాగంగా నిన్న భారత్ - సౌతాఫ్రికాల మధ్య జరిగిన నాలుగో వన్డేలో ప్రోటీస్ తాత్కాలిక సారథి మర్క్రమ్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. ఈ క్యాచ్తో టీమిండియా ఎక్కువ పరుగులు చేసే అవకాశాన్ని కోల్పోయింది. సఫారీ స్పీడ్స్టర్ రబాడ వేసిన 47వ ఓవర్ ఆఖరి బంతిని భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య భారీ షాట్కు ప్రయత్నించాడు. ఐతే తన మీదుగా వెళ్తున్న బంతిని అంచనా వేసిన మార్క్రమ్ అంతే వేగంగా ఎగిరి బంతిని ఒడిసిపట్టి పాండ్యను పెవిలియన్ కు పంపాడు. ఈ క్యాచ్ కు క్రీడాభిమానులు ఫిదా అయిపోతున్నారు.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 289 పరుగులు చేసింది. అనంతరం వర్షం అంతరాయం కారణంగా 28 ఓవర్లలో 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు 25.3 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించారు. సిరీస్ లో భాగంగా ఐదో వన్డే మంగళవారం పోర్ట్ ఎలిజబెత్లో జరగనుంది.