పెడన, ఫిబ్రవరి 12 : కృష్ణా జిల్లా పెడనలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు బ్రాంచ్ కార్యాలయంలో ఆదివారం అర్ధరాత్రి చోరీకి విఫలయత్నం జరిగింది. ప్రధాన ద్వారం తలుపు గొళ్లాన్ని కట్ చేసి లోపలికి ప్రవేశించిన దుండగులు నగదు దోచుకునే ప్రయత్నం చేశారు. లాకర్లు ఎంతకీ తెరుచుకోకపోవడంతో బ్యాంకులో ఉన్న సీసీ కెమెరాలను పగలగొట్టడంతోపాటు ఆ కెమెరాలకు సంబంధించిన డీవీఆర్, మానిటర్ను ఎత్తుకెళ్లిపోయారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్వ్కాడ్ ను రంగంలోకి దించి ఆధారాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.