విశాఖపట్నం, ఫిబ్రవరి 15: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తమ ఎంపీలు రాజీనామా చేస్తారని ప్రతిపక్ష వైకాపా పార్టీ అధినేత జగన్ చేసిన వాఖ్యలపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు ఘాటుగా స్పందించారు. ఐదు సంవత్సరాలు పాలించమని ప్రజలు ఓట్లేస్తే ముందే ఎందుకు రాజీనామా చేస్తామంటున్నారో సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాలను ఒక్క రూపాయి తగ్గకుండా అందిస్తామని మోదీ ప్రభుత్వం వాగ్దానం చేసింది. ఆ మాటకు మా పార్టీ కట్టుబడి ఉంది. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను ప్రధాని మోదీ అమలు పరుస్తున్న సమయంలో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామని జగన్ వెల్లడించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.