పలమనేరు, ఫిబ్రవరి 16 : చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని మొరం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. భూగర్భ వ్యర్థాలను శుభ్రం చేస్తుండగా ఏడుగురు కార్మికులు ఊపిరాడక మృత్యువాత పడ్డారు. శుక్రవారం ఉదయం శ్రీవెంకటేశ్వర హెచరీస్ యాజమాన్యం ఆదేశాల మేరకు కార్మికులు వ్యర్థాలను శుభ్రం చేసేందుకు డ్రైనేజీలోకి దిగారు. అందులోకి వచ్చే వ్యర్థాల్లో రసాయనాల కలవడంతో మొదట దిగిన నలుగురు కార్మికులు అందులోనే స్పృహ తప్పిపోయారు. వాళ్లను కాపాడేందుకు ప్రయత్నించిన మరో ముగ్గురు కార్మికులు కూడా అపస్మారక స్థితికి చేరుకున్నారు.
విషయం తెలుసుకున్న గ్రామస్థులు వెంటనే అక్కడకు చేరుకుని మురుగు కాలువ పైకప్పును తీసి వారిని బయటకు తీశారు. చికిత్స కోసం పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా నలుగురు మార్గమధ్యలోనే మరణించారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మరో కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.