అమీర్పేట, ఫిబ్రవరి 16 : అమీర్పేట మెట్రో స్టేషన్ లో యువతి పట్ల అమర్యాదగా ప్రవర్తించిన మెట్రో ఉద్యోగిపై కేసు నమోదయింది. అమీర్పేట మెట్రో ఇంటర్ ఛేంజ్ స్టేషన్లో జరిగిన ఈ సంఘటన వివరాలను ఇన్స్పెక్టర్ వహీదుద్దీన్ వెల్లడించారు. సికింద్రాబాద్కు చెందిన యువతి(22) రసూల్పురా వెళ్లేందుకు జేఎన్టీయూ మెట్రో స్టేషన్లో రైలెక్కింది. అమీర్పేట ఇంటర్ ఛేంజ్ స్టేషన్లో దిగి రెండో అంతస్తులో రైలు మారాల్సి ఉండటంతో లిఫ్ట్ ఎక్కింది.
మెట్రో స్టేషన్లో టికెటింగ్, క్యాష్ మేనేజ్మెంట్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న ట్రిగ్ డిటెక్టివ్ సర్వీసెస్కు చెందిన నితిన్రెడ్డి(25) లిఫ్ట్లో యువతితో పాటే వచ్చి ఆమెను అసభ్యంగా తాకాడు. అదేవిధంగా మళ్లీ మళ్లీ చేయడంతో బాధితురాలు ఎస్సార్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు.