అగర్తల, ఫిబ్రవరి 17: ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలో రేపు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే దేశంలో 19 రాష్ట్రాల్లో పాగా వేసిన అధికార బీజేపీ, 25ఏళ్ల పాటు త్రిపురను పాలిస్తున్న సీపీఎం నేతృత్వంలోని వామపక్షాలకు చెక్ పెట్టనుందా? లేదా? అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలునుండగా.. 59 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఛరిలామ్ అసెంబ్లీ నియోజకవర్గంలో రేపు జరగాల్సిన ఎన్నికను మార్చి 12వ తేదీకి వాయిదా వేశారు.
పోలింగ్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భద్రత నిమిత్తం 300 కంపెనీల కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. వీరితో పాటు రాష్ట్రంలోని పోలీసులు భద్రతా విధుల్లో పాలు పంచుకోనున్నారు. మార్చి 3న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.