హైదరాబాద్, ఫిబ్రవరి 17: తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ కథానాయకుడిగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం '2.ఓ'. ఈ సినిమా కోసం యావత్ భారత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. కాగా ఈ చిత్ర విడుదల విషయంలో స్పష్టమైన తేదిను చిత్రబృందం ప్రకటించలేదు. వీఎఫ్ఎక్స్ పనులు పూర్తికాని కారణంగా గత కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తోంది. అమీజాక్సన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ ‘ఖిలాడీ’ అక్షయ్కుమార్ ప్రతినాయక ఛాయలున్న పాత్ర పోషిస్తున్నారు. మరి అంతటి ఆసక్తిని రేకెత్తిస్తున్న చిత్రం విడుదల వాయిదాకు కారణం ఏంటి? అని ప్రశ్నిస్తే.. ఈ విషయంపై కోలీవుడ్లో ఓ న్యూస్ హల్ చల్ చేస్తుంది.
‘2.ఓ’ వీఎఫ్ఎక్స్ పనులకు అమెరికాకు చెందిన ఓ సంస్థకు అప్పగించింది చిత్ర బృందం. అయితే ఆ సంస్థ దివాలా తీసినట్లుగా ప్రకటించుకుంది. దీంతో 3డీ ఎఫెక్ట్స్తో సహా మొత్తం వీఎఫ్ఎక్స్ పనులు మళ్లీ మొదలు పెట్టాల్సి ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే చేసిన వీఎఫ్ఎక్స్ పనులపై కూడా చిత్ర బృందం సంతృప్తిగా లేదట. సినిమా ఉన్నతంగా ఉండాలని అందులో ఎలాంటి రాజీ పడకూడదని భావిస్తున్నారట. దీంతో వీఎఫ్ఎక్స్ పనులను కొత్త బృందానికి అప్పగించే అవకాశ ఉందని చిత్ర వర్గాల సమాచారం.