తిరుపతి, ఫిబ్రవరి 18: విభజన చట్టంలోని హామీలను నేరవేర్చలంటూ ఒక వైపు టీడీపీ, మరో వైపు ప్రజలు కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్న విషయం తెలిసిందే. కాగా కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ మోదీ, చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాలుగేళ్లలో 29సార్లు దిల్లీకి వెళ్లానని చెప్పుకుంటున్న సాధించింది మాత్రం ఏమి లేదని వ్యాఖ్యానించారు. ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి నియోజకవర్గాల పెంపుపై తప్ప విభజన హామీలపై చంద్రబాబు కేంద్రంతో చర్చించలేదని అన్నారు. ప్రధాని మోదీ... లలిత్ మోదీ, నీరవ్ మోదీలకు లాభం చేకూరుస్తూ ఏపీకి అన్యాయం చేశారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. వెంటనే కేంద్రానికి మద్దతు ఉపసంహరించుకోవాలని వెల్లడించారు.