న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21 : దేశ రాజధాని ఢిల్లీ లో ముఖ్యమంత్రి ఎదుట ఆప్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రకాశ్ జార్వాల్, అమాన్తుల్లా ఖాన్ ఢిల్లీ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్పై దాడి చేయడం పెను దుమారం రేపింది. ఈ కేసులో పోలీసులు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రకాశ్ జార్వాల్ను అరెస్ట్ చేశారు.
సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాల సమక్షంలోనే ముఖ్యమంత్రి నివాసంలో ఇద్దరు ఎమ్మెల్యేలు సోమవారం రాత్రి తనపై దాడి చేశారని అన్షు ప్రకాశ్ కేసు పెట్టారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరో ఎమ్మెల్యే అమాన్తుల్లా ఖాన్ ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దమయ్యింది. పోలీసులు ఆయన కోసం గాలింపు చర్యలు చేస్తున్నట్లు సమాచారం.
నిన్న రాత్రి జరిగిన సమావేశంలో ఆప్ పార్టీ విజయాలకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలను ఎందుకు టీవీలలో ప్రకటనలుగా ఇవ్వడం లేదన్న విషయంలో సీఎస్ అన్షు ప్రకాశ్ కు ఆప్ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగిందని విశ్వసనీయవర్గాల సమాచారం.
'సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆధికారులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పినప్పటికీ ఎమ్మెల్యేలు అమానుతుల్లా ఖాన్, ప్రకాశ్ జార్వాల్ కలిసి నా తల, కణతపై పిడిగుద్దులు గుద్దారు. కళ్లజోడు పగిలిపోయింది. నేను తప్పించుకొని బయటపడి ఇంటికి వెళ్లా' అని ప్రకాష్ ఫిర్యాదులో వెల్లడించారు.