ఖాట్మండు, ఫిబ్రవరి 21 : నేపాల్లో అతిపెద్ద పార్టీ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. దేశంలోనే రెండు ప్రధాన కమ్యూనిస్టు పార్టీలైన సీపీఎన్–యూఎంఎల్, సీపీఎన్–మావోయిస్టు సెంటర్ చారిత్రక వీలినానికి ఒప్పందం కుదిరింది . నేపాల్ సార్వత్రిక, ప్రావిన్షియల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఈ కూటమి ఏకం కానుందని చాలా రోజులుగా వార్తలు వచ్చాయి. దీనిని నిజం చేస్తూ ఇప్పుడు ఒప్పందం ఖరారైంది. నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని సీపీఎన్–యూఎంఎల్, మాజీ ప్రధాని ప్రచండ నేతృత్వంలోని సీపీఎన్–మావోయిస్టు సెంటర్ కలసి డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేశాయి. 275 మంది సభ్యుల పార్లమెంట్లో ఈ కూటమి 174 స్థానాలను దక్కించుకొని అధికారం చేజిక్కించుకొంది.